వావివరసలు మరచిన కన్నతల్లి.. ఆ కడుపునొప్పి అసలు నిజాన్ని బయటపెట్టింది

కన్నప్రేమ కరువైంది.. వావివరసలు మరిచిన ఒక తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్నకూతురినే కామాంధుడికి బలిపశువును చేసింది.

Arun Chilukuri
Published on: 23 Feb 2026 1:03 PM IST
వావివరసలు మరచిన కన్నతల్లి.. ఆ కడుపునొప్పి అసలు నిజాన్ని బయటపెట్టింది
X

వావివరసలు మరచిన కన్నతల్లి.. ఆ కడుపునొప్పి అసలు నిజాన్ని బయటపెట్టింది

కన్నప్రేమ కరువైంది.. వావివరసలు మరిచిన ఒక తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్నకూతురినే కామాంధుడికి బలిపశువును చేసింది. అనారోగ్యంతో ఉన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి, తన ప్రియుడితో ఆమెపై అత్యాచారం చేయించిన అమానుష ఘటన చెన్నై సాలిగ్రామంలో వెలుగుచూసింది.

అసలేం జరిగింది?:

సాలిగ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతని భార్య దక్షిణామూర్తి(50) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన తల్లి ప్రవర్తనను 20 ఏళ్ల కుమార్తె పలుమార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో, తల్లితో మాట్లాడటం మానేసింది.

నిద్రమాత్రలు ఇచ్చి ఘాతుకం:

గత నెల 3వ తేదీన కుమార్తె స్వల్ప అనారోగ్యానికి గురవ్వగా, తల్లి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చింది. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత తన ప్రియుడు దక్షిణామూర్తిని పిలిపించి ఆమెపై అత్యాచారం చేయించింది. మళ్లీ అదే నెల 23న రెండోసారి ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే, ఈసారి యువతికి స్పృహ రావడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన తల్లి, ఆమెను గదిలో వేసి తాళం వేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది.

గర్భం దాల్చడంతో వెలుగులోకి..

బాధిత యువతి అతికష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని తిరువణ్ణామలైలోని తన బంధువుల ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించడంతో అసలు విషయం బయటపడింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సెయ్యారు మహిళా పోలీసులు కేసు నమోదు చేయగా, ఘటన జరిగిన ప్రాంతం వడపళని పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. ఆదివారం పోలీసులు నిందితుడు దక్షిణామూర్తిని, అతడికి సహకరించిన తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story