Telangana inter exams: సెంటర్కు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థిని.. పరీక్ష రాయనివ్వని అధికారులు
Telangana inter exams: ఎల్లారెడ్డిపేటలో ఎగ్జామ్ సెంటర్కు 17 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఇంటర్ విద్యార్థినికి అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు.
Telangana inter exams: సెంటర్కు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థిని.. పరీక్ష రాయనివ్వని అధికారులు
ఎగ్జామినేషన్ సెంటర్కు ఆలస్యంగా చేరుకుందనే కారణంతో ఇంటర్ విద్యార్థినికి పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. పరీక్ష సెంటర్ గేటు వద్దే విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య బొప్పాపూర్ రాచర్ల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. బుధవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆమె తండ్రి సెంటర్ వద్ద దింపుతానని చెప్పినప్పటికీ సమయానికి రాలేదు. దీంతో పరీక్షకు ఆలస్యమవుతుందనే ఆందోళనతో శరణ్య బస్టాండ్కు వెళ్లి ఆర్టీసీ బస్సులో ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకుంది.
అయితే, పరీక్ష ప్రారంభమైన తర్వాత సుమారు 17 నిమిషాల ఆలస్యంగా, ఉదయం 9.05 గంటల సమయంలో సెంటర్కు చేరుకోవడంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. అనంతరం విద్యార్థిని కాలేజీ సిబ్బంది మరియు ఉన్నతాధికారులను సంప్రదించగా, తహశీల్దార్ సుజాత సెంటర్కు చేరుకుని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. పరిశీలనలో విద్యార్థిని ఆలస్యంగా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో నియమాల ప్రకారం పరీక్షకు అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు.
పరీక్షల వంటి ముఖ్యమైన సందర్భాల్లో సమయపాలన ఎంతో అవసరమని, విద్యార్థులు ముందుగానే సెంటర్కు చేరుకోవాలని అధికారులు సూచించారు.




