Devarakadra trees cutting: పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ పగ.. 200 చెట్ల నరికివేతపై కేటీఆర్ ఆగ్రహం
మహబూబ్ నగర్ జిల్లాలో పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరికివేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చదనంపై పగబట్టిందని ఆరోపించారు.
KTR Tweet on Devarakadra trees cutting
Devarakadra trees cutting: తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలోని ప్రకృతి వనంలో సుమారు 200 చెట్లను కాంగ్రెస్ నాయకులు నరికివేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. ట్విట్టర్ (X) వేదికగా ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణను పచ్చని రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రారంభించి, ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనుషులనే కాకుండా, పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని ఆయన ఆరోపించారు.
పదేళ్ల కష్టాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు
Devarakadra trees cutting: మహబూబ్ నగర్ జిల్లాలోని జీనుగురాలలో పదేళ్ల పాటు ఎంతో అపురూపంగా పెంచిన చెట్లను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే స్వయంగా నరికివేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. "పదేళ్ల పాటు ఆహ్లాదాన్ని పంచిన పల్లెలను కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఒకవైపు చెక్ డ్యామ్లను పేల్చివేస్తూ, మరోవైపు చెరువులను కబ్జా చేస్తూ పల్లె ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నారు. ఇప్పుడు చివరకు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారు" అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని, కులవృత్తులను ఇప్పటికే కాలరాసిన ప్రభుత్వం, ఇప్పుడు పచ్చదనంపై దాడికి దిగడం వారి రాజకీయ కక్షసాధింపునకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. పచ్చని చెట్లపై కాంగ్రెస్ నాయకులకు అంత పగ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కఠిన చర్యలకు డిమాండ్
Devarakadra trees cutting: ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కేసులు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పల్లె ప్రకృతి వనాలు కేవలం చెట్లు మాత్రమే కావని, అవి గ్రామస్తుల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పల్లెలు మళ్లీ 'పల్లె కన్నీరు పెడుతుందో' అని పాడుకునే దుస్థితికి చేరుకున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.




